రాయ్పూర్ : చత్తీస్ఘఢ్లో కాంగ్రెస్ నిష్క్రమణకు (Chhattisgarh Polls) కౌంట్డౌన్ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తొలి దశ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతం ఖాయమైందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 17న మలి దశ పోలింగ్కు ముందు సోమవారం ముంగేలిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ దౌర్భాగ్య పాలనకు చత్తీస్ఘఢ్ ప్రజలు చరమగీతం పాడనున్నారని చెప్పారు. ఐదేండ్ల పాటు మిమ్మల్ని దోచుకున్న కాంగ్రెస్ పాలకులను సాగనంపే సమయం ఆసన్నమైందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇక ఎంతమాత్రం కోరుకోవడం లేదన్నారు. చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ రాష్ట్రంలో అవినీతి పాలనతో కోట్లు దండుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తే అవినీతి నేతలపై చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. చత్తీస్ఘఢ్ సీఎం తన నియోజకవర్గంలో ఓడిపోతారని మీడియా మిత్రులు తనకు చెప్పారని వివరించారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్లో కాంగ్రెస్ నేతలకు సంబంధం ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు.
మహదేవ్ యాప్ స్కామ్లో రూ. 508 కోట్ల అవినీతి జరిగిందని, ఈ కేసులో పెద్దమొత్తంలో నగదును దర్యాప్తు సంస్ధలు స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. చత్తీస్ఘఢ్ సీఎంకు అత్యంత సన్నిహితుడు ఈ కేసులో జైలులో ఉన్నారని గుర్తుచేశారు. ఈ స్కామ్లో సీఎంకు ఎంత డబ్బు ముట్టింది, పార్టీ నేతలు ఎంత తీసుకున్నారు, ఢిల్లీకి ఎంత డబ్బు చేరిందనే వివరాలను కాంగ్రెస్ వెల్లడించాలని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు.
Read More :