న్యూఢిల్లీ: మోదీ సర్కార్ పాలనలో సైనికులకూ సకాలంలో జీతాలు అందడం లేదు. సైనిక దవాఖానాల్లో అంతులేని లోపాలు, సైనిక సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యాలు, రక్షణ మౌలిక సదుపాయాల నిర్వహణలో వైఫల్యాలను తెలియచేస్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) మంగళవారం తన నివేదికను పార్లమెంట్ ముందు ఉంచింది. మూడు ప్రధాన విభాగాలను కాగ్ ఆడిట్ చేసింది. పే అండ్ అకౌంట్స్ ఆఫీసులు(పీఏవోలు), ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్(ఆఫీసర్లు), మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్) పరిధిలోని కాంట్రాక్టుల్లో అంతర్గత నియంత్రణలు, నాణ్యతా తనిఖీలు, రక్షణ శాఖ కింద ఉన్న సైనిక దవాఖానల నిర్వహణను కాగా నివేదిక పరిశీలించింది.
పలువురు సైనిక సిబ్బంది తమ జీతాలు, భత్యాలు సకాలంలో, లేదా సరైన మొత్తంలో అందుకోలేదని ఆడిట్ గుర్తించింది. ప్రొవిజనల్ ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్(పీఎఫ్ఎస్ఏ) సమీక్షలో జాప్యాల కారణంగా ఉద్యోగ విరమణ సమయంలో అధికారులు, జూనియర్ కమిషన్డ్ అధికారులు (జేసీఓ), ఇతర ర్యాంకుల (ఓఆర్) నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో రికవరీలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. అవసరమైన నిబంధనలు లేకపోవడం సహా ఐటీ వ్యవస్థలో లోపాల కారణంగా చెల్లింపులో జాప్యాలు, అవకతవకలు జరిగినట్లు కూడా కాగ్ పేర్కొన్నది.
సైనిక నిర్మాణ పనులకు సంబంధించి సైట్ రికార్డుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో నిర్మాణ నాణ్యతను అంచనావేయడం, కాంట్రాక్టర్ని బాధ్యుడిని చేయడం కష్టతరంగా మారినట్లు కాగ్ పేర్కొన్నది. నిర్మాణ ప్రగతి, వస్తువులు, పరీక్షలకు సంబంధించిన వివరాలతో కూడిన రికార్డులను డిటిజలైజ్ చేయాలని కాగ్ సిఫార్సు చేసింది. ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్లు(పీటీవోలు), మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ(హెచ్ఆర్ఎంఎస్)లో డాటా సరిగా అనుసంధానం కాకపోవడం వల్ల అనేక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, కాగ్ తెలిపింది.
సైనిక దవాఖానల్లో అనేక లోపాలను గుర్తించినట్లు కాగ్ తెలిపింది. అనేక దవాఖానల్లో హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్(హెచ్వీఏసీ) వంటి ముఖ్య సేవలు అసంపూర్తిగా ఉన్నట్లు ఆడిట్లో బయటపడ్డాయి. డిమాండుకు తగ్గ స్థాయిలో ఔషధాలు సమకూర్చడంలో సాయుధ దళాల మెడికల్ స్టోర్స్ డిపోలు(ఏఎఫ్ఎంఎస్డీ) విఫలమైనట్లు ఆడిట్ తెలిపింది. సాధారణంగా ప్రిస్ర్కైబ్ చేసే మందులు కూడా లేవని, మందులను సకాలంలో మార్చకపోవడంతో రూ.13.52 కోట్ల విలువైన నిల్వలు వాడకుండా మిగిలిపోయాయని నివేదిక పేర్కొన్నది. కొన్ని దవాఖానల్లో సరైన లైసెన్సులు లేకుండా ఎక్స్రే యంత్రాలను నడుపుతున్నట్లు కాగ్ పేర్కొన్నది.