న్యూఢిల్లీ/భటిండా, జనవరి 5: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం ఘోర పరాభవం ఎదురైంది. వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న పంజాబ్ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించటంతోపాటు ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనను నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన సభాస్థలికి వెళ్లకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. హుస్సేనీవాలాలో జాతీయ అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించి, అటునుంచి ఫిరోజ్పూర్ చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అక్కడే బీజేపీ ఏర్పాటు చేసిన భారీ ఎన్నికల ర్యాలీలో పాల్గొనాలని నిర్ణయించారు. అందుకోసం మోదీ బుధవారం బఠిండా చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అక్కడి నుంచి హెలికాప్టర్లో హుస్సేనీవాలా వెళ్లాలి. అయితే వర్షంతో వాతావరణం అనుకూలించడం లేదని రోడ్డుమార్గంలో వెళ్లాలని చివరి నిమిషంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీకి తెలిపి హుస్సేనీవాలాకు బయలుదేరారు. గమ్యస్థానానికి మరో 30 కిలోమీటర్ల దూరంలో ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తున్న పలువురు ఆందోళనకారులు రోడ్డుపై ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, వాహనాలు నిలిపి రాకపోకలను స్తంభింపజేయటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రధాని కాన్వాయ్ అక్కడి ఓ ఫ్లై ఓవర్పైకి చేరుకోగానే ముందుకు సాగే పరిస్థితి లేక నిలిచిపోయింది. దీంతో అక్కడే ఆయన దాదాపు 20 నిమిషాలు వేచిచూశారు. ప్రధాని భద్రతను చూసే ఎస్పీజీ కమెండోలు ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో చేసేదేమీ లేక ప్రధాని తిరిగి బఠిండా ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు. ప్రధాని పర్యటనను అడ్డుకొనేందుకే పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. మరోవైపు భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ సమగ్ర నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. – ఇదంతా అధికారవర్గాలు ప్రకటించిన సమాచారం.
అవునా? అదంతా నిజమేనా?
కానీ పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు, స్థానికులు, నెటిజన్లు ఈ వ్యవహారంపై మరోలా స్పందిస్తున్నారు. దేశ రాజధానిలో ఏడాది పొడవునా జరిగిన రైతులు చేసిన పోరాటాలకే ఉలుకూ పలుకూ లేని ప్రధాని కేవలం ఓ రోడ్డుపై జరిగిన చిన్న నిరసనకే జడిసి వెనక్కి వెళ్లిపోయాడా? గుప్పెడు మంది రైతులు కలిసి పదివేల మంది పోలీసుల పహారాను ఛేదించి రోడ్డుపై బైఠాయించగలరా? అసలు సాధ్యమేనా? అని నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. మోదీ పాల్గొనాల్సిన ఎన్నికల సభకు ప్రజలు రాక అట్టర్ఫ్లాప్ కావటంతోనే భద్రతాలోపం సాకుచూపి మోదీ తిరుగుటపా కట్టారని కాంగ్రెస్ విమర్శించింది. ప్రధాని పర్యటనకు తాము 10 వేలమందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశామని, భద్రతలో ఎలాంటి లోపాలు లేవని పంజాబ్ సీఎం చరణ్జిత్సింగ్ చన్నీ స్పష్టం చేశారు. నిజానికి ప్రధాని ఫిరోజ్పూర్ ర్యాలీ కోసం భద్రతా ఏర్పాట్లను తానే అర్ధరాత్రి వరకు పర్యవేక్షించానని తెలిపారు. ప్రధాని ర్యాలీకోసం 70 వేల కుర్చీలు వేస్తే 700 కూడా రాలేదని అదే ఆయన వెనక్కి వెళ్లేందుకు కారణమని చెప్పారు.
యూపీ ఎన్నికలపై ప్రభావం పడుతుందేమోనని
వాస్తవానికి ఫిరోజ్పూర్లో 47,250 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధానమంత్రి మోదీ బుధవారం ఉదయం శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆ సభకు 70 వేల మంది హాజరయ్యేందుకు సీట్లు ఏర్పాటు చేశారు. కానీ ప్రధాని అక్కడికి చేరే సమయానికి కనీసం 7వందల మంది కూడా లేకపోవడం గమనార్హమని పంజాబ్ అధికార పార్టీ నేతలు బాహాటంగా సోషల్ మీడియాల్లో ప్రకటించారు. ఈ లోపు సభకు హాజరైన మీడియా ఖాళీ కుర్చీల ఫొటోలను ప్రసారం చేసింది. అదే సమయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా.. జనం లేని విషయాన్ని ప్రధానమంత్రి సిబ్బందికి చేరవేసింది. ఈ ఖాళీ కుర్చీల సన్నివేశం, సభకు జనం పెద్దగా హాజరు కాని విషయం వంటివి త్వరలోనే జరగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున వెనుతిరిగే నిర్ణయం తీసుకొని ఉంటారని ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ నిపుణుడు విశ్లేషించారు. హర్యానా, రాజస్థాన్ల నుంచి వస్తున్న బీజేపీ కార్యకర్తల బస్సుల రాకకు అనుకూలంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అయినా ప్రధాని వెనక్కి తిరిగి వెళ్లడం కచ్చితంగా రాజకీయమేనని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ రణ్దీప్సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. వాయుమార్గంలో ఖరారైన ప్రధాని పర్యటన అకస్మాత్తుగా రోడ్డు మార్గానికి మారిందని, స్థానిక రైతులకు తెలిసే అవకాశం లేదని పంజాబ్కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఎస్పీజీ ఆధీనంలో ఉండగా.. నిరసన సాధ్యమేనా?
ఎప్పుడైనా ఎక్కడైనా మామూలు వీఐపీలు పర్యటిస్తేనే అక్కడ పోలీసు బలగాలు ఆ పర్యటనలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా దారుల వెంట ప్రయాణం సవ్యంగా సాగేలా చూస్తాయి. ఇక దేశ ప్రధానమంత్రి పర్యటిస్తున్నారంటే ఇంకెంత భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రధానమంత్రి సభ సజావుగా సాగేందుకు పంజాబ్ ప్రభుత్వం పదివేల మంది పోలీసులు, ఇతర బలగాలతో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ‘ప్రధాని రాక సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్తో కలిపి పదివేల మందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశాం. ఆయన పర్యటనను 9 రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఎక్కడా చిన్న పొరపాట్లకు కూడా మేం తావీయ దల్చుకోలేదు. డ్రోన్లు కనబడినా నేలకూల్చేలా ఎన్ఎస్జీ, బీఎస్ఎఫ్ నుంచి ప్రత్యేక సహాయం తీసుకున్నాం. చీమ చిటుక్కుమన్నా పట్టివేసేలా హ్యూమన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఉంచాం’ అని అడిషనల్ డీజీపీ జి.నాగేశ్వర్రావు వెల్లడించారు.