PM Modi : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25 ఆశాజనకంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. కేంద్ర బడ్జెట్ మెరుగ్గా ఉందని స్వాగతిస్తూ ఎన్నో ఉపాధి అవకాశాలకు ఇది ఊతమిస్తుందని స్వాగతించారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. పేద, అణగారిన వర్గాలు, గ్రామీణ, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు ఈ బడ్జెట్ అద్దం పడుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో రైతుల మేలు కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇన్కం ట్యాక్స్ రెమిషన్ స్కీమ్తో మధ్యతరగతికి చెందిన కోటి మందికి భారీ ఊరట లభిస్తుందని అన్నారు.
ఇక భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ సర్కార్ చిట్ట చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ.. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందని అన్నారు. గడిచిన పదేళ్లలో మహిళల సాధికారత పెరిగిందన్నారు. ట్రిపుల్ తలాక్ను చట్టరీత్యా నేరం చేశామన్నారు. ప్రభుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మహిళలకు ఇండ్లు అందజేసినట్లు చెప్పారు.
అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని రికార్డు సమయంలో క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు. భారత అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాలు భాగస్వామ్యం అవుతున్నాయన్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్ వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం మహిళల సంఖ్య పెరిగిందన్నారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు ఆమె వెల్లడించారు.
Read More :
Budget 2024 | మధ్య తరగతి ప్రజలకు కొత్తగా గృహనిర్మాణ విధానం : నిర్మలా సీతారామన్