న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. కొందరు యువకులు పార్లమెంట్లో చొరబడి గందరగోళం సృష్టించడం దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని అన్నారు. ఘటన తీవ్రత దృష్ట్యానే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దీనిపై సీరియస్గా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాటి వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. వాటికి పరిష్కారాన్ని కనుగొనడం కూడా అంతే ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. పరిష్కారం కోసం అందరూ ఓపెన్ మైండ్తో ఆలోచన చేయాలని సూచించారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ వివాదాలు, ప్రతిఘటనలకు దూరంగా ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు.
కాగా, 2001 డిసెంబర్ 13న పార్లమెంట్పై ఉగ్రవాదుల దాడి జరిగింది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత అదే రోజున అంటే 2023 డిసెంబర్ 13న ఆరుగురు యువకులు పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇద్దరు పార్లమెంట్ లోపల, ఇద్దరు పార్లమెంట్ వెలుపల కలర్ గ్యాస్ డబ్బాలతో హంగామా చేశారు. కాసేపు గందరగోళం సృష్టించారు. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.