న్యూఢిల్లీ, మే 22: గత ఎనిమిదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్పై రూ.50, సిలిండర్పై ఏకంగా రూ. 645 పెంచిన మోదీ సర్కారు ఇప్పుడు కంటితుడుపుగా కాస్త తగ్గించి భారీగా తగ్గించినట్టు గొప్పలకు పోతున్నది. ఇంధన ధరలపై రాష్ర్టాలు కూడా పన్నులు తగ్గించాలని పనిలో పనిగా ఉచిత సలహా ఇస్తున్నది. ఎడాపెడా ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం.. అసలు పన్నులే పెంచని తమకు రేట్లు తగ్గించమని హితబోధ చేయడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
మమ్మల్ని అడిగారా?
పెట్రోల్, డీజిల్పై రాష్ర్టాలు కూడా వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరడంపై తమిళనాడు ఆర్థికమంత్రి పలానివేల్ త్యాగరాజన్ మండిపడ్డారు. ధరలు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరని కేంద్రం ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తున్నదని విరుచుకుపడ్డారు. 2014 తర్వాత లీటర్ పెట్రోల్పై ఎక్కైజ్ సుంకాన్ని 250 శాతం, డీజిల్పై 900 శాతాన్ని పెంచిన కేంద్రం ఇప్పుడు కొంత మేర తగ్గించి రాష్ర్టాలకు సూచనలు చేస్తున్నదని విరుచుకుపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా? అంటూ ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్పై కేంద్రానికి ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, సెస్, సర్చార్జీ ఇలా పలు రకాలుగా ఆదాయం వస్తున్నదని బిజూ జనతా దల్ (బీజేడీ) ఎంపీ అమర్ పట్నాయక్ అన్నారు. అయితే, పెట్రోల్పై రాష్ర్టాలకు కేవలం వ్యాట్ ద్వారానే ఆదాయం వస్తున్నట్టు గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో రాష్ర్టాలు పన్నులు తగ్గించాలంటూ కేంద్రం కోరడంపై అసహనం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణానికి నిజంగా కళ్లెం వేయాలనుకొంటే ట్యాక్స్, సుంకాలు, సెస్లను కేంద్రం తగ్గించాలని డిమాండ్ చేశారు.
మీరు నిధులిస్తేనే.. రాష్ర్టాలు వ్యాట్ తగ్గిస్తాయి
రాష్ర్టాలకు కేంద్రప్రభుత్వం మరిన్ని నిధులు, గ్రాంట్లను మంజూరు చేస్తే తప్ప, అవి పెట్రోల్పై వ్యాట్ను తగ్గించే స్థితిలో లేవని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. సుంకాల నుంచి రాష్ర్టాలకు వచ్చే రాబడి తక్కువ అని, వ్యాట్ ద్వారా వచ్చే మొత్తమే రాష్ర్టాలకు ప్రధానమని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు రాష్ర్టాలు కూడా పెట్రోల్పై వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ర్టాల పరిస్థితి.. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉన్నదని అభివర్ణించారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు పేరిట కేంద్రం ప్రజలను మోసం చేస్తున్నదని కాంగ్రెస్ విరుచుకుపడింది. కంటితుడుపు చర్యలు కాకుండా ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు అసలైన ఉపశమనం కలిగించాలని ఆ పార్టీ నేత రాహుల్గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
పెంచింది కొండంత.. తగ్గించేది పిసరంత
మోదీ తొలిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు అంటే 2014 మే 26న లీటర్ పెట్రోల్ రూ.71.41. దీనిపై కేంద్రం అప్పుడు విధించిన ఎక్సైజ్ సుంకం రూ.9.48. అలాగే, డీజిల్ ధర రూ. 55.49గా ఉండగా దీనిపై ఎక్సైజ్ సుంకం రూ. 3.56గా ఉండేది. ఆ సమయంలో బ్యారెల్ చమురు ధర 108 డాలర్లుగా ఉన్నది. కరోనా లాక్డౌన్లో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 12 డాలర్లకు తగ్గింది. ఈ లెక్కన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గాలి. అయితే, వినియోగదారుల జేబుల్లోకి చేరాల్సిన ఆ ప్రయోజనాలను మోదీ సర్కారు ఖజానాకు మళ్లించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా రూ. 32.90, డీజిల్పై రూ. 31.80కు పెంచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర జీవితకాల కనిష్టానికి చేరినప్పటికీ, ఆ సమయంలో కూడా దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.85గా ఉంది. మొత్తంగా గడిచిన 8 ఏండ్లలో పెట్రోల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని 250 శాతం (రూ. 23.42) పెంచగా, డీజిల్పై 900 శాతాన్ని (రూ. 28.24) వడ్డించింది. ఇప్పుడు పెట్రోల్పై రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి.. గొప్ప తగ్గింపుగా చెప్పుకొంటున్నది.