న్యూఢిల్లీ, మే 21: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన మంత్రివర్గ సహచరులతో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో తలెత్తిన పరిణామాలు, పరిపాలన, పాలనలో లోపాలపై ఆయన మంత్రులతో సమీక్షించారు. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా భారత దేశంపై పడుతున్న ఆర్థిక ప్రభావం గురించి మంత్రులకు వివరించిన ఆయన, దాని దుష్పరిణామాలు, అసౌకర్యం భారత పౌరులపై అతి తక్కువగా పడేలా మంత్రులు పనిచేయాలని కోరారు.
విద్యుత్, వ్యవసాయం, ఎరువులు, వైమానికం, షిప్పింగ్, లాజిస్టిక్స్ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా భారత్ను తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రులను ప్రధాని మోదీ కోరారు. సమావేశంలో అరడజను కన్నా ఎక్కువ మంది మంత్రులు ప్రెజెంటేషన్లు ఇచ్చారు.