బెళగావి: భారతీయ రాజులు, మహారాజులను అవమానించే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి.. నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్షాలు పాల్పడిన అరాచకాలపై మాట్లాడేందుకు మాత్రం నోరు రాదని ప్రధాని మోదీ విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కర్ణాటకలో ఆదివారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఇటీవల ఓ కాలేజీలో జరిగిన విద్యార్థిని హత్య గురించి ఆయన ప్రస్తావించారు. ‘వారసత్వ పన్ను’ అంశంపై కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని మోదీ తన ఆరోపణలను కొనసాగించారు. దేవణగెరెలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఏడాది చొప్పున పంచుకోవాలనేది ఇండియా కూటమి ఫార్ములా అని అన్నారు.