PM Modi : తాము అధికారం లోకి రాగానే ఒక్క దెబ్బకు పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. దేశం నుంచి ఒక్కసారిగా పేదరికాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ రాజు (రాహుల్ గాంధీ) వద్ద మంత్రదండం ఏమైనా ఉందా అని మోదీ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఒకే దెబ్బతో తాను దేశంలో పేదరికాన్ని పారదోలుతానని రాహుల్ చెప్పగానే దేశ ప్రజలంతా ఆశ్చర్యపోయారని అన్నారు.
ఈ రాచరికపు మెజీషియన్ ఇప్పటివరకూ ఎక్కడ దాగిఉన్నారని దేశం అడుగుతున్నదని చెప్పారు. గత వారం రాజస్ధాన్లో ఓ ప్రచారసభలో రాహుల్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారం చేపడితే ఒకే దెబ్బకు పేదరికం తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా రూ. లక్ష నగదు అందచేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పధకం కింద పేద కుటుంబాల మహిళలకు ప్రతి ఏటా రూ. లక్ష అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇక హోషంగాబాద్ ర్యాలీలో ప్రధాని తన ప్రసంగం కొనసాగిస్తూ స్వాతంత్య్రానంతరం పలు దశాబ్ధాల పాటు ఒకే కుటుంబం నేరుగా లేకుంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిందని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాము కోరుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పేకమేడల్లా కూల్చివేసిందని ఆరోపించారు. అదే కుటుంబం దేశంలో ఎమర్జెన్సీ విధించిందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేస్తే దేశం దివాళా తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోను బాధ్యతగా రూపొందించాలని, దేశ ప్రజలకు ఇచ్చే హామీలను నెరవేర్చాలనే ఆసక్తి విపక్షాలకు లేదని దుయ్యబట్టారు.
Read More :