PM Modi : వారణాసిలో కొందరు యువకులు తప్పతాగి రోడ్లపై పడిఉండటం చూశానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ప్రధాని శుక్రవారం తన లోక్సభ నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మతిస్ధిమితం కోల్పోయిన వారు కాశీలోని పిల్లలను తాగుబోతులని అంటున్నారని రాహుల్ పేరు ప్రస్తావించకుండా ప్రధాని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ యువరాజు వారణాసి ప్రజలను వారి సొంత గడ్డపైనే అవమానించారని దుయ్యబట్టారు. రెండు దశాబ్ధాలుగా మోదీని ద్వేషించిన వారు ఇప్పుడు యూపీ యువతపై తమ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. యూపీ యువతను విపక్ష ఇండియా కూటమి అవమానించిన తీరును తానెన్నడూ మరిచిపోనని అన్నారు. కాశీ, అయోధ్య కొత్త రూపు సంతరించుకోవడం ఇండియా కూటమి నేతల అసహననానికి మరో కారణమని చెప్పారు.
కుటుంబవాదం, అవినీతి, బుజ్జగింపుధోరణుల కారణంగా యూపీ దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతి సారీ విపక్ష పార్టీలు జట్టు కట్టి ఆపై ఫలితాలు నిరాశాజనకంగా రావడంతో తమలో తాము కలహించుకుంటాయని మోదీ ఎద్దేవా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశమంతటా మోదీ గ్యారంటీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. యూపీలోని అన్ని సీట్లనూ ఎన్డీయే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Telangana | బిచ్చం అడిగినందుకు తన్నిన డిప్యూటీ తహశీల్దార్.. టిప్పర్ కింద పడి యాచకుడు మృతి