PM Modi | కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya)లో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో (Ayodhya Ram Temple) రామ్ లల్లా ప్రాణప్రతిష్ట (Pran Pratishta) కార్యక్రమం ప్రారంభోత్సవం మరికొద్ది సేపట్లో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని తాజాగా అయోధ్యకు చేరుకున్నారు. మధ్యాహ్నం రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో పాల్గొననున్నారు. బాలరాముడి విగ్రహాన్ని రామాలయం గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత 1:15 గంటలకు ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
భద్రతా వలయంలో అయోధ్య నగరం..
మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కొనసాగనుంది. ఈ వేడుకల కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అదే సమంయలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సుమారు 7 వేల మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. సుమారు 13 వేల మంది భద్రతా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులతోపాటు ఏటీఎస్ కమాండోలు, సీఆర్పీఎఫ్ దళాలు, యాంటీ డ్రోన్ జామర్లను ఏర్పాటు చేశారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, స్నిపర్లు మోహరించారు. నగరంలో పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగిస్తున్నారు. డ్రోన్లతో నగరంపై ఓ కన్నేసి ఉంచారు. ఇక ధరంపత్, రాంపత్ హనుమాన్ గర్హి ప్రాంతం, అషర్ఫీ భవన్ వీధుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
సరయూ నది వెంబడి ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్యకు వెళ్లే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. అయోధ్యలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాసులు ఉన్నవారికి మాత్రమే ఆలయ ప్రాంగణం వద్దకు అనుమతిస్తున్నారు.
Also Read..
Mukesh Ambani | జై శ్రీరామ్ నామాలతో విరాజిల్లిన అంబానీ నివాసం ఆంటిలియా.. VIDEO
Chiranjeevi | ఫ్యామిలీతో కలిసి అయోధ్య చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి
Ayodhya | భద్రతా వలయంలో అయోధ్య.. మోహరించిన స్నిపర్స్, యాంటీ బాంబ్ స్క్వాడ్