అయోధ్య: యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (Ram Lalla) విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ వేడుక జరగనుంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఆలయ ప్రారంభోత్సవానికి 7 వేల మంది అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 13 వేల మందితో అయోధ్యలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అయోధ్య నగరం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది.
ఉత్తరప్రదేశ్ పోలీసులతోపాటు ఏటీఎస్ కమాండోలు, సీఆర్పీఎఫ్ దళాలు, యాంటీ డ్రోన్ జామర్లను ఏర్పాటు చేశారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, స్నిపర్లు మోహరించారు. నగరంలో పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగిస్తున్నారు. డ్రోన్లతో నగరంపై ఓ కన్నేసి ఉంచారు. ఇక ధరంపత్, రాంపత్ హనుమాన్ గర్హి ప్రాంతం, అషర్ఫీ భవన్ వీధుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సరయూ నది వెంబడి ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్యకు వెళ్లే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. అయోధ్యలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాసులు ఉన్నవారికి మాత్రమే ఆలయ ప్రాంగణం వద్దకు అనుమతిస్తున్నారు.