కోల్కతా: గుజరాత్లో ఇవాళ రెండో (చివరి) దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు అధికార బీజేపీ అక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో రోడ్ షో నిర్వహించింది. ఓటు వేసేందుకు వచ్చిన ప్రధాని.. దాదాపు రెండు గంటలపాటు రోడ్ షోలో పాల్గొన్నారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.
దీనిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తనదైన శైలిలో కొంచెం వెటకారంగా స్పందించారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే అక్కడ ఎలాంటి రోడ్ షోలకు అనుమతించరని, అయితే ప్రధాని నరేంద్రమోదీ, ఆయన పార్టీ నేతలు వీవీఐపీలు కాబట్టి వాళ్లు తలుచుకుంటే ఏదైనా చేయగలరని వ్యాఖ్యానించారు. వాళ్లు ఏం చేసినా చెల్లుబాటవుతుందని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా జీ20 సమావేశంపై కూడా మమతా బెనర్జి మాట్లాడారు. ఢిల్లీలో జరగబోయేది కేవలం ప్రధానితో సమావేశంగా భావించరాదని, అది జీ20 సమావేశమని మమత అభిప్రాయపడ్డారు. అయితే, జీ20 లోగోగా కమలం పువ్వును పెట్టాలన్న బీజేపీ యోచనను మమత తప్పుపట్టారు. కమలం జాతీయ పుష్పమేగానీ, అది ఒక రాజకీయ పార్టీకి గుర్తుగా కూడా ఉన్నందున జీ20 లోగోగా ఉపయోగించడం కరెక్ట్ కాదన్నారు. దానికి బదులు చాలా ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు.