వారణాసి, డిసెంబర్ 18: వరుసగా మూడోసారి అధికారం చేపట్టి, భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని, దేశ ప్రజలకు ఇదే నా గ్యారంటీ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం వారణాసిలో జరిగిన ర్యాలీలో తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే.. మూడోసారి తానే ప్రధాని అవుతానని నర్మగర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని వ్యాఖ్యలు సోషల్మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 2025 సెప్టెంబర్లో ప్రధాని మోదీకి 75 ఏండ్లు రాబోతున్నాయి. 75 ఏండ్లు దాటాయన్న నెపంతో పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, వెంకయ్యనాయుడు తదితరులను ఎన్నికల రాజకీయాల నుంచి దూరం పెట్టిన మోదీ-అమిత్ షా ద్వయం, తమ విషయంలో అది పాటించకపోవటాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తమకు గిట్టని వారిని పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం ఎంచుకున్న ‘రెండు నాల్కల ధోరణి’గా విమర్శించారు.