PM Modi : మహిళల ఆర్ధిక శక్తిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీ శక్తి అద్వితీయ పాత్ర పోషించిందని ప్రధాని ప్రశంసించారు. ఈరోజు ప్రపంచంలోనే మనం అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఎదిగామని అన్నారు.
భారత డెయిరీ రంగంలో ఎనిమిది కోట్ల మంది పనిచేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. మన డైరీ పరిశ్రమ టర్నోవర్ రూ. 10 లక్షల కోట్లకు ఎదిగిందని చెప్పారు. మోదీ గురువారం అహ్మదాబాద్లో గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల్లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలంటే మహిళల ఆర్ధిక శక్తిని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 30 లక్షల కోట్ల విలువైన ముద్ర రుణాల్లో 70 శాతం లబ్ధిదారులు మహిళలేనని చెప్పారు. దేశంలో పదేండ్లుగా మహిళా స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళల సంఖ్య 10 కోట్లు దాటిందని తెలిపారు.
Read More :