జైపూర్: అసెంబ్లీ ఎన్నికల ముందు రాజస్థాన్ (Rajasthan) కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) పై పలుమార్లు విమర్శలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot).. ఇటీవల సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు ఏకంగా గెహ్లాట్ సర్కారుకు ఓ అల్టిమేటం జారీచేశారు. గత బీజేపీ ప్రభుత్వాల అవినీతిపై 15 రోజుల్లోగా చర్యలు చేపట్టకపోతే తన ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తానని పైలట్ హెచ్చరించారు.
గతంలో బీజేపీ పాలనలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల పేపర్ల లీకేజీ తదితర అంశాలపై విచారణకు డిమాండ్ చేస్తూ సచిన్ పైలట్ చేపట్టిన ఐదు రోజుల ‘జన్ సంఘర్ష్ యాత్ర’ ఇవాళ్టితో ముగిసింది. ఈ సందర్భంగా పైలట్ మాట్లాడుతూ.. ‘అవినీతికి వ్యతిరేకంగా నేను, సీఎం గెహ్లాట్ పోరాడాం. కానీ ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేసి కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలి. పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి. 15 రోజుల్లోగా గెహ్లాట్ సర్కారు ఈ డిమాండ్లపై స్పందించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తా’ అని పైలట్ హెచ్చరించారు.
తాను చేపట్టబోయే ఆందోళన మూలంగా తలెత్తే ఎలాంటి పరిణామాలకు భయపడబోనని, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడుతానని సచిన్ పైలట్ తెగేసి చెప్పారు. చాలారోజులుగా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సచిన్ పైలట్ ఒకరోజు నిరాహార దీక్ష చేయగా.. అశోక్ గెహ్లాట్ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. దాంతో వారి మధ్య విభేదాలు మిరంత తీవ్రమయ్యాయి. సీఎం గెహ్లాట్ కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని కాకుండా వసుంధరా రాజేను తన నాయకురాలిగా భావిస్తున్నాడంటూ పైలట్ ఎద్దేవా చేశారు.