ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పెట్రో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పెట్రోల్ ధర 50 పైసలు, డీజిల్ రేటు 55 పైసలు పెరిగింది. గత ఆరు రోజుల్లో పెట్రో రేట్లు పెరగడం ఇది ఐదోసారి. ఈ కొత్త రేట్లతో ఢిల్లీలో పెట్రోలు లీటరు 99.11 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 89,87కు చేరింది.
మొత్తమ్మీద ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోలుపై లీటరుకు రూ.3.70 పెరగ్గా.. డీజిల్ ధర రూ.3.75 పెరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు గత నవంబరు 4 నుంచి పెట్రో ధరలను కేంద్రం పెంచలేదు. ఈ నాలుగు నెలల కాలంలో పెట్రో రేట్లు పెంచకపోవడంతో రిటైలర్లు సుమారు 2.25 బిలియన్ డాలర్లు అంటే మన లెక్కల్లో రూ.19వేల కోట్ల పైగా నష్టపోయారని తెలుస్తోంది.
ఇదిలా వుండగా, ఆయిల్ కంపెనీలు భవిష్యత్తులో డీజిల్ లీటరు ధరను రూ.13.1 నుంచి రూ.24.9 వరకు పెంచాలని, అలాగే పెట్రోలుపై లీటరుకు రూ.10,6 నుంచి రూ.22.3 వరకు పెంచాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.