న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజా పెంపుతో దేశ ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51 (84 పైసలు), డీజిల్ రూ.96.70గా (85 పైసలు) ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71, కోల్కతాలో పెట్రోల్ రూ.106.34 (84 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి.
ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున అధికమయ్యాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. కాగా, దేశంలో గతేడాది నవంబర్ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిలు ధరలు రూ.2.40 చొప్పున పెరిగాయి.
అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో చమురు కంపెనీలు లీటరు డీజిలుపై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోలుపై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు వడ్డించే అవకాశం ఉన్నదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.