యాదాద్రి, జూన్30: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో జాప్యం ఉండొద్దని, రాబోవు రెండు నెలల్లో చివరిదశ పనులను పూర్తి చేయాలని వైటీడీఏ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి తెలిపారు. బుధవారం యాదాద్రి కొండపై జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయంలో పనులు చేపట్టిన లైటింగ్, సాలాహార, క్యూ కాంఫ్లెక్స్, ప్రసాద విక్రయశాల భవన కాంట్రాక్టర్ల్లతో పాటు యాదాద్రిలో జరుగుతున్న పనులు నిర్వహిస్తున్న దాదాపు 70 మంది కాంట్రాక్టర్లు చీఫ్ ఆర్కిటెక్ట్ మధుతో కలిసి సమీక్ష జరిపారు. పనుల్లో జరుగుతున్న జాప్యంపై పునః పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎంవో ముఖ్యకార్యదర్శి భూపాల్రెడ్డి ఆదేశాలతో కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష జరిపినట్లు తెలిపారు. నెలలోపే యాదాద్రి ఆలయంలో లైటింగ్ బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలని గుత్తేదార్లకు సూచించినట్లు తెలిపారు. క్యూ కాంప్లెక్స్, రోడ్ల నిర్మాణం, ప్యారాపిట్ వాల్స్, శివాలయం పనులు, ప్రసాద విక్రయశాల, లిప్టు, రథశాలతో పాటు మెట్ల నిర్మాణం, ఎస్కులెటర్తో పాటు కొండపైన నిర్మిస్తున్న పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఒక్కో కాంట్రాక్టర్కు ఒక్కో తేదీ కేటాయించినట్లు తెలిపారు. యాదాద్రి ఆలయ పనుల్లో ఎలాంటి జాప్యం ఉండొద్దని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించినట్లు ఆయన వివరించారు. దాదాపు ఆలయ పనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా మిగిలిపోయిన పనులు వెంటనే పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని వైటీడీఏ అధికారులను తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్రెడ్డి, దయాకర్రెడ్డి, ఆలయ ఈఈ రామారావు పాల్గొన్నారు.