ముందుస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే చాన్స్
కొవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది : వైద్యులు
ఆదిలాబాద్, మే 6 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. నాలుగు నెలలుగా పంపిణీ కొనసాగుతుండగా.. వైద్యసిబ్బంది పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. టీకా ప్రయోజనాలు, విలువలు తెలియజేస్తూ చైతన్య పరుస్తున్నారు. ఫలితంగా పీహెచ్సీ, సీహెచ్సీ, ప్రధాన వైద్యశాల ముందు బారులుదీరుతున్నారు. ఇందుకోసం సర్కారు కూడా వసతులు కల్పిస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,32,337 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 45 ఏండ్లు దాటిన వారికి టీకా ఇస్తుండగా.. కొవిన్, ఆరోగ్యసేతు యాప్లలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు వాక్సిన్ పంపిణీపై వైద్యశాఖ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో ఇప్పటి వరకు 3,32,337 మందికి టీకావేశారు.ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాల్లో టీకా పంపిణీ చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్తో పాటు ఉట్నూర్, బోథ్ కమ్యూనిటీ వైద్యశాలల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ముందుగా ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా పంపిణీ చేశారు. తర్వాత 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం కరోనా టీకా పంపిణీ చేస్తున్నది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. టీకా ప్రారంభంలో ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అధికారులు వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. దీంతో ప్రజలు క్రమంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,154 మందికి టీకా వేశారు. వీరిలో హెల్త్కేర్ వర్కర్లు 7320, ఫ్రంట్లైన్ వర్కర్లు 5372, 60 ఏళ్లు దాటిన వారు 17,609 మంది, 45ఏళ్లు దాటిన వారు 28,853 మంది ఉన్నారు.
దవాఖానల వారీగా
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నది. రిమ్స్లో 18,472 మందికి, యూపీహెచ్సీ కుర్షిద్నగర్-2787, యూపీహెచ్సీ పుత్లీబౌలి-2660, యూపీహెచ్సీ శాంతినగర్-2010, యూపీహెచ్సీ హమాలివాడ-1988, ఉట్నూర్ కమ్యూనిటీ దవాఖాన-1773, బోథ్- 2172, అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-1500, బజార్హత్నూర్ పీహెచ్సీ-1174, బేల-2439, భీంపూర్-1131, దంతనపల్లి- 535, గాదిగూడ-171, దిమ్మ- 1690, గుడిహత్నూర్-1624, హస్నాపూర్ పీహెచ్సీ- 456, ఇచ్చోడ-1732, ఇంద్రవెల్లి-1110, జైనథ్-3470, ఝరి-424, నర్సాపూర్ (టీ) పీహెచ్సీ-525, నేరడిగొండ-789, పిట్టబొంగరం- 593, శ్యాంపూర్-532, సొనాల-1073, సైద్పూర్-336, తలమడుగు-2715, తాంసి-1879, నార్నూర్ పీహెచ్సీలో 1546 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.
వ్యాక్సిన్ తీసుకుంటే రక్షణ
వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా నుంచి రక్షణ లభిస్తుంది. అర్హులైన వారందరూ సర్కారు దవాఖానలకు వచ్చి టీకా తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకినా దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. దవాఖానల్లో చేరడం, వెంటిలేటర్ దాకా పోయే ప్రమాదం ఉండదు. ప్రజలు అపోహలు వీడి టీకా తీసుకోవాలి. కొవిన్ సైట్లో స్మార్ట్ఫోన్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు లేని వారు మీ సేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. గ్రామాల్లో నిరక్ష్యరాస్యులు వైద్య సిబ్బందిని సంప్రదిస్తే వారు సాయం చేస్తారు.
శ్రీకాంత్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, ఆదిలాబాద్