కోల్కతా: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండేండ్ల తర్వాత ప్యాసింజర్ రైళ్లు (Passenger train) మళ్లీ కూతపెట్టనున్నాయి. కరోనాతో నిలిచిన రైలు సర్వీసులు ఈ నెలాఖరులో పునఃప్రారంభంకానున్నాయి. మే 29న ఇరు దేశాల రైల్వే మంత్రులు ప్యాసింజర్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు భారతీయ రైల్వే అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి భారత్, బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లను 2020, మార్చి నెలలో నిలిపివేశారు. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో రైళ్లను ప్రారంభించాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ నెల 29న కోల్కతా-ఢాకా మైత్రి ఎక్స్ప్రెస్ను బంగ్లాదేశ్ రైల్వే, కోల్కతా-ఖుల్నా మధ్య నడిచే బంధన్ ఎక్స్ప్రెస్ను భారతీయ రైల్వే పునరుద్ధరించనున్నాయి. అదేవిధంగా ఎన్జేపీ-ఢాకా మిటాలి ఎక్స్ప్రెస్ సర్వీసులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లను ఇరు దేశాల రైల్వే మంత్రులు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.