Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం శనివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆల్పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల సన్నాహాలపై నేతలకు వివరించారు. కాంగ్రెస్ నేత అధిర్రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఘ్వాల్, వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి, ఆర్ఎల్జేపీ ఎంపీ పశుపతి కుమార్ పరాస్తో పాటు పలు పార్టీల ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయన్నారు.
సమావేశాలకు సంబంధించి అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమైన అంశాలపై చర్చించాలని అన్ని పార్టీల నేతలను కోరానన్నారు. సభ గౌరవ ప్రదంగా నడిచేలా.. సభా కార్యక్రమాలకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ సమావేశాల్లో ఏయే అంశాలను లేవనెత్తాలనేదానిపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సమయంలో వివిధ బిల్లులపై చర్చకు ఎంత సమయం కేటాయిస్తారు?.. ఇటీవల విడుదల చేసిన అన్పార్లమెంటరీ పదాల అంశంపై సైతం ఆల్పార్టీ మీటింగ్లో చర్చ జరిగినట్లు తెలిసింది.