reservation : దేశంలో రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులే అయితే.. వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నించింది. వెనుకబడిన తరగతులకు చెందిన వారి కుటుంబాలు ఆర్థికపరమైన, విద్యాపరమైన ప్రయోజనాలు పొందిన తర్వాత కూడా వారి పిల్లలు రిజర్వేషన్ ఫలాలు పొందడం అవసరమా అని ప్రశ్నించింది.
వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ అమలులో క్రీమీ లేయర్ వర్తించడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి, కీలక వ్యాఖ్యలు చేసింది. “తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్లే అయితే వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అవసరం..? విద్యాపరంగా, ఆర్థికపరంగా, సామాజికంగా వారు ముందడుగు వేసినట్లే. అయినప్పటికీ వారు తమ పిల్లలకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటే, ఇందులోంచి ఎప్పటికీ బయటపడలేం. మేం దీని గురించే ఆందోళన చెందుతున్నాం. దీనివల్ల ఏం ఉపయోగం..? ఇంకా రిజర్వేషన్లు ఇస్తున్నారు.
తల్లిదండ్రులు బాగా చదివి ఉన్నతస్థానంలో ఉండి, మంచి ఆదాయం పొందుతున్నారు. కానీ, వారి పిల్లలు మళ్లీ రిజర్వేషన్ అడుగుతున్నారు. అలాంటి వారు రిజర్వేషన్ నుంచి బయటకు రావాలి” అని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల కర్ణాటకలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం పొందాడు. కానీ, అతడి క్యాస్ట్, ఆదాయం, ఇతర ధృవీకరణ పత్రాలు పొందిన తర్వాత క్రీమీ లేయర్ కారణంగా ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ అతడు కోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.