Bihar | పాట్నా: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభానికి ముందే ఓ ముఠా చేతికి ఈ ప్రశ్నపత్రాలు చేరినట్లు సమాచారం. దీంతో ఈ నెల 15న రెండు షిఫ్టుల్లో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలను రద్దు చేసినట్లు కమిషన్ బుధవారం ప్రకటించింది. ఈ పరీక్షలు జరిగే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. కమిషన్ చైర్మన్ పర్మార్ రవి మనుభాయ్ మాట్లాడుతూ, మూడో దశ పరీక్షను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. ఆర్థిక నేరాల విభాగం ఈ పరీక్షలను రద్దు చేయాలని నివేదికిచ్చింది.