న్యూఢిల్లీ, మార్చి 9 : డిమాండ్ స్వల్పంగా పెరిగినా, సరఫరా గొలుసులు బిగుసుకుపోయినా మార్కెట్లు స్పష్టమైన ఒత్తిడితో స్పందిస్తాయి. ప్రస్తుతం ఇరాన్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) సహా అనేక పట్టణాలు, నగరాల్లోని ఎల్పీజీ ఏజెన్సీల బయట ఆ ఒత్తిడి కనిపిస్తున్నది. నోయిడాలోని సెక్టార్ 22లో ఓ భారత్ గ్యాస్ ఏజెన్సీ వెలుపల ఖాళీ సిలిండర్లు పట్టుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరి నిలబడి ఉన్న దృశ్యాలు సోమవారం ఉదయం కనిపించాయి. అదే విధంగా ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలోని బర్ద్పూర్ గ్రామంలో ఓ గ్యాస్ ఏజెన్సీ బయట వందలాది మంది ప్రజలు ఖాళీ సిలిండర్లతో నిలుచున్న దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో మార్చి 7న వైరల్ అయింది. ఎల్పీజీ సిలిండర్ల కోసం కొన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వెలుపల బారులుతీరి నిలబడుతున్నట్లు వార్తలు వస్తుండగా.. దేశంలో ఎక్కడా ఎల్పీజీ సంక్షోభం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వస్తున్న వార్తలతో ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు కొందరు గ్యాస్ సరఫరాదారులు కృత్రిమ కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. గ్యాస్ ఏజెన్సీలో స్టాక్ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో రూ. 1,500 ఇచ్చి ఎల్పీజీ సిలిండర్ కొనవలసి వచ్చిందని ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న పట్టణానికి చెందిన మహిళ ఒకరు తెలిపారు. రంజాన్ మాసం కావడంతో ఎల్పీజీ అత్యవసరమని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన ఆ గృహిణి చెప్పారు. గత నాలుగైదు రోజులుగా ప్రజలు భయాందోళనలతో ఎల్పీజీని కొనుగోలు చేస్తున్నట్లు దక్షిణ ఢిల్లీలోని ఇండేన్ గ్యాస్కు చెందిన సిలిండర్ డెలివరీ ఉద్యోగి ఒకరు చెప్పారు. గతవారం ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచిన కేంద్రం సిలిండర్ రీబుకింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. ఎల్పీజీ సిలిండర్లపై ఆంక్షలు పెంచిన దరిమిలా హైదరాబాద్, రాంచి, కోల్కతా, గోవా తదితర నగరాల్లో కూడా ఎల్పీజీ కోసం ప్రజలు బారులుతీరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వంటగ్యాస్ అక్రమ నిల్వను నిరోధించి అందరికీ సమానంగా పంపిణీ జరిగే లక్ష్యంతో ఎల్పీజీ సిలిండర్ కనీస వెయిటింగ్ కాలాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు ప్రభుత్వం పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రెండు సిలిండర్లు ఉన్న వారికైతే లాక్ ఇన్ పీరియడ్ను 30 రోజులకు పెంచింది. ప్రపంచ ముడి చమురు బ్యారెల్ ధర 130 డాలర్లు దాటేంతవరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉంటాయని వర్గాలు చెప్పాయి. బ్యారెల్ చమురు ధర 100 డాలర్ల సమీపంలో స్థిరపడవచ్చని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నట్లు పేర్కొన్నాయి. దేశంలో ఏ పెట్రోల్ పంపు వద్ద పెట్రోల్, డీజిల్కి కొరత లేదని, సరఫరా కూడా సజావుగా సాగుతున్నదని తెలిపాయి. ముడి చమురు సరఫరాకు అంతరాయాన్ని నివారించేందుకు హొర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాలపై కేంద్రం దృష్టి కేంద్రీకరించినట్లు వివరించాయి.