ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం
భారత్ అవసరాల్లో సగం అక్కడి నుంచే
రవాణా ఆగిపోతే పామాయిల్కు కొరత
యుద్ధంతో ఇప్పటికే మండుతున్న రేట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్లోకి రానున్నది. భారత దేశం ప్రతీ ఏడాది సగటున 13 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకొంటున్నది. ఇందులో పామాయిల్ వాటా 8.5 మిలియన్ టన్నులు. భారతదేశ పామాయిల్ అవసరాల్లో సగం.. అంటే నాలుగు మిలియన్ టన్నుల పామాయిల్ను ఇండోనేషియా నుంచే దిగుమతి చేసుకొంటున్నాం.
ఇండోనేషియా నిషేధం కారణంగా మే నెల నుంచి ఈ దిగుమతులు ఆగిపోతాయి. ఫలితంగా ఇండియాలో పామాయిల్ కొరత ఏర్పడుతుంది. డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా పామాయిల్ ధరలు మరింత పెరుగుతాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం కేవలం ఇండియాపైనే కాదు ప్రపంచం అంతటిపై ప్రభావం చూపనున్నది. ప్రపంచం మొత్తమ్మీద ప్రతీ ఏడాది 240 మిలియన్ టన్నుల వంట నూనెలు వినియోగిస్తున్నారు. ఇందులో పామాయిల్ వాటా 80 మిలియన్ టన్నులు. ఇందులో 50% (40మిలియన్ టన్నులు) ఇండోనేషియా నుంచే వస్తున్నది. ఇండోనేషియా నుంచి ఎగుమతులుఆగిపోతే దానిపై ఆధారపడ్డ దేశాలన్నీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రూ.225 దాటొచ్చు
యుద్ధం కారణంగా ఇండియాకు పొద్దు తిరుగుడు నూనె దిగుమతులు సగానికి పడిపోయాయి. ఫలితంగా పామాయిల్కు ఇప్పటికే డిమాండ్ పెరిగింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందుతో పోలిస్తే పామాయిల్ ధర 50% కంటే ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం లీటరుకు రూ. 175 ఉండగా.. ఇది రూ.225కు చేరవచ్చని అంచనా. పామాయిల్ను కేవలం ఆహార ఉత్పత్తుల్లోనే కాకుండా కాస్మెటిక్స్, బయో ఇంధనాల తయారీలోనూ వాడతారు. వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.