న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా( Lashkar-e-Taiba) ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. దేశరాజధాని చాందినీ చౌక్లో ఉన్న ఓ ఆలయం వద్ద కూడా పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు భద్రతా వర్గాల ద్వార తెలుస్తోంది. ఐఈడీల ద్వారా ఆ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఫిబ్రవరి 6వ తేదీన జరిగిన మసీదు పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఉగ్రవాద సంస్థ ప్రతీకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది.
ఇస్లామాబాద్ మసీదు పేలుడు ఘటనలో 31 మంది మరణించగా, 160 మంది గాయపడ్డారు. పాక్ పేలుడు ఘటనకు తామే కారణం అని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ప్రకటించుకున్నది. గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది మరణించారు. ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ డాక్టర్ ఉమర్ నబీ కారులో ఆత్మహుతికి పాల్పడ్డాడు.