ప్రేమలో పడిన వాళ్లు ఒక్కోసారి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించరు. మనసులోని వారి కోసం ఎంతటి తప్పులైనా చేయడానికి వెనుకాడరు. తాజాగా వెలుగు చూసిన ఘటన కూడా అలాంటిదే. కలిజా నూర్ అనే యువతి పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో ఉంటుంది. ఆమెకు ఆన్లైన్లో అహ్మద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
అహ్మద్ ఒక హైదరబాదీ. సౌదీలో ఒక హోటల్లో పనిచేస్తున్న అహ్మద్.. నూర్ ఇద్దరూ ఆన్లైన్లో తెగ ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో నూర్ ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయం తెలిసిన అహ్మద్.. తనతో కలిసి పనిచేసే నేపాలీ స్నేహితుల సాయంతో ఆమెను అక్రమంగా భారత్కు తీసుకొచ్చే ప్లాన్ వేశాడు.
ఈ ప్లాన్ ప్రకారం, దుబాయ్ నుంచి నేపాల్ వచ్చిన నూర్.. అక్కడ జీవన్ అనే వ్యక్తితోపాటు అహ్మద్ సోదరుడు మహమూద్ను కలిసింది. అనంతరం ముగ్గురూ కలిసి నూర్ను భారత్ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇండో-నేపాల్ బోర్డర్ పోలీసులకు అనుమానం వచ్చింది.
నూర్ వద్ద ఉన్న ధ్రువపత్రాలు నకిలీవని తేలడంతో.. ఆమె పాక్ గూఢచారేమో అని అనుమానించారు. దాంతో నూర్తోపాటు జీవన్, అహ్మద్ను కూడా కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణలో.. తను ప్రేమించిన వాడి కోసం నూర్ ఇంతటి సాహసం చేసిందని గుర్తించారు. అయితే అక్రమంగా బోర్డర్ దాటడం నేరం కాబట్టి.. ముగ్గురినీ స్థానిక పోలీసులకు అప్పగించారు.