Pahalgam Attack | ఉగ్రవాదంపై పోరాటం భారత్కు రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ తెలిపారు. ‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గాం జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు’ అని జైస్వాల్ పేర్కొన్నారు. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ప్రకారం శిక్షించాలని అన్నారని, భారతదేశం-రష్యా విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంటామని చెప్పారన్నారు.
ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ విక్టరీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఉగ్రదాడిని పుతిన్ ఖండించారు. ఈ విషాద సమయంలో భారత్కు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు పహల్గాం నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంతాప సందేశం పంపారు. ఈ దారుణమైన నేరాన్ని సహించేది లేదని.. ఈ దాడికి కారకులైన వారిని తప్పకుండా శిక్షిస్తారని ఆశిస్తున్నామని.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్తో మా సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పుతిన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.