న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత కల్లోలం సృష్టిస్తున్నది. దవాఖానల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు ప్రాణవాయువు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని ప్రముఖ దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో రోగులు మరణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని సరోజ్ దవాఖానలో ఆక్సిజన్ కొరతతో కొత్తగా రోగులను చేర్చుకోవడం లేదని ప్రకటించింది. హాస్పిటల్లో ఇప్పటికే ఉన్న రోగులను డిశ్చార్జీ చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రాణవాయువు తగిన మోతాదులో లేకపోవడంతో రోగులను చేర్చుకోవడం లేదని, పాతవారిని ఇంటికి పంపిస్తున్నామని దవాఖాన వర్గాలు తెలిపాయి. నిన్న మ్యాక్స్ దవాఖాన కూడా ఇదే కారణంతో కొత్తగా రోగులను చేర్చుకోలేదు. అయితే ఆక్సిజన్ అందడంతో కొన్నిగంటల తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
తమ దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు అడుగంటుతున్నాయని, వెంటనే సప్లయ్ చేసేలా డైరెక్షన్స్ ఇవ్వాలని సరోజినీ హాస్పిటల్ రెండు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్డులో పిటిషన్ దాఖలు చేసింది. తమ దవాఖానలో 70 మంది రోగులు క్రిటికల్, ఇన్టెన్సివ్ కేర్లో ఉన్నారని, మరో 48 మంది వెంటీలేటర్పై ఉన్నారని అందులో పేర్కొంది. 172 మంది రోగుల్లో సుమారు 64 మందికి ఆక్సిజన్ అందించడం అత్యవసరమని తెలిపింది.
సర్ గంగారామ్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరతతో 22 మంది కరోనా రోగులు చనిపోయిన విషయం మరవక ముందే.. మరో ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ దవాఖానలో ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. మరో 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం అర గంటకు మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్నూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆస్పత్రిలో 350 మంది రోగులు కరోనా చికిత్స పొందుతున్నారని ఆ ఆస్పత్రి వైద్యుడు గుప్తా తెలిపారు. ఇవాళ ఉదయం ఢిల్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఒక ఆక్సిజన్ ట్యాంకర్ను సమకూర్చిందని చెప్పారు. ఇది కేవలం గంటన్నర వరకు మాత్రమే సరిపోతుందన్నారు. ప్రతి రోజు తమ ఆస్పత్రికి 8 వేల లీటర్ల ఆక్సిజన్ అవసరం. కానీ ఢిల్లీ ప్రభుత్వం పంపింది మాత్రం కేవలం 500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే అని గుప్తా పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..