హుస్నాబాద్, జూలై 23: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఐవోసీ భవనంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎల్నినో పరిస్థితులపై హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిద్దిపేట కలెక్టర్ హైమావతి, కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పేయితో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు. ఎల్నినోపై ప్రతి ప్రభుత్వ శాఖ ముందస్తు ప్లాన్ఆఫ్ యాక్షన్ తయారు చేయాలన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రైతులు ఆయిల్పామ్ పంటలు సాగు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఎల్నినో నుంచి ఉపశమనం పొందే పనులతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ కాల్వల నిర్మా ణం కోసం రూ. 250 కోట్లు మంజూరయ్యాయని, భూసేకరణ జరుగుతున్నదని మంత్రి తెలిపారు. ఎల్నినోపై క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని, వరి పంట సాగు చేయకుండా ఇతర పంటలు వేసుకునేలా చూడాలన్నారు. అధికారు లు సమన్వయంతో ఉండి ఈ ఏడు ఎల్నినో నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, రెవెన్యూ, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్, మిషన్భగీరథ, పంచాయతీరాజ్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.