సూరత్ : కరోనా మహమ్మారి విజృంభణతో ప్రతి ఒక్కరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం గడుపుతున్నారు. కొవిడ్ రోగులకు వైద్య సేవలందించే డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నాలుగు నెలల గర్భిణి అయిన ఓ నర్సు కొవిడ్ రోగులకు సేవలందిస్తూ తన గొప్ప మనసును చాటుకుంటోంది.
సూరత్కు చెందిన నాన్సి అయేజ్ మిస్ర్తీ ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. అయినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా కొవిడ్ రోగులకు సేవలందిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన విధిని తాను నిర్వర్తిస్తున్నానని తెలిపారు. రోగులకు సేవ చేయడమే తనకు అతిపెద్ద ప్రార్థన అని నర్సు పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా ఆస్పత్రిలోనే ఆమె రోజాలో పాల్గొంటున్నారు.