న్యూఢిల్లీ : హర్యానాలోని భివానిలో బజరంగ్దళ్ కార్యకర్తలు ఇద్దరు ముస్లిం యువకులను హత్య చేశారనే ఆరోపణలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. బీజేపీ గోరక్షకులను కాపాడుతోందని, ముస్లిం యువకుల హత్యోదంతంలో హర్యనా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఎంపీ అసదుద్దీన్ కాషాయ పార్టీ తీరుపై మండిపడ్డారు.
యువకులను గోరక్షక ముఠాగా చెప్పుకుంటున్న వారు హత్య చేస్తే వారిని బీజేపీ, ఆరెస్సెస్లు సమర్ధిస్తున్నాయని ఆరోపించారు. కాషాయ పార్టీ ముస్లింల ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న ఓవైసీ జునైద్, నాసిర్ల హత్యను తీవ్రంగా ఖండించారు. జునైద్, నాసిర్ల మరణానికి హిందూ రాజ్య స్ధాపనను విశ్వసించేవారే బాధ్యత వహించాలని అన్నారు. దేశంలో వ్యవస్ధాగతంగా ముస్లింలపై విద్వేషాన్ని వ్యాపింపచేస్తున్నారని దుయ్యబట్టారు. నిందితులపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారా అని తాను బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని అడగదలుచుకున్నానని అన్నారు.
గోరక్షకులుగా చెప్పుకుంటున్న వారు ప్రజలను బలిగొంటున్నారని ఇలాంటి వారిని బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాజస్ధాన్లోని భరత్పూర్కు చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం దుండగులు అపహరించగా మరుసటి రోజు ఉదయం భివానీలోని లాహోరు వద్ద వారి మృతదేహాలు దగ్ధమయిన స్ధితిలో లభించాయి.
బజరంగ్దళ్కు చెందిన గోరక్షకులుగా చెప్పుకుంటున్నవారు ఆ యువకులను అపహరించి హత్య చేశారని ఆరోపణలున్నాయి. ఈ ఘటనను రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్రంగా ఖండించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన సీఎం నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.