Cyber Crime | న్యూఢిల్లీ: దేశంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 31 వరకు సైబర్ నేరగాళ్లు మన దేశం నుంచి రూ.10,319 కోట్లు దోచుకున్నారు. దర్యాప్తు సంస్థలు దీనిలో దాదాపు రూ.1,127 కోట్ల మేరకు మన దేశంలోనే బ్లాక్ చేయగలిగాయి.
దీనిలో 9-10 శాతం వరకు బాధితుల ఖాతాల్లో తిరిగి జమ చేయగలిగాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో 2021లో 4.52 లక్షల కేసులు నమోదు కాగా, 2022లో 9.66 లక్షలు, 2023లో 15.56 లక్షల కేసులు నమోదయ్యాయి. భారత్లో జరుగుతున్న సైబర్ దాడుల్లో 50 శాతం వరకు విదేశాల నుంచే జరుగుతున్నాయి. కాంబోడియా, వియత్నాం, చైనా, ఇతర దేశాల్లోని ముఠాలు ఈ దాడులకు పాల్పడుతున్నారు.