National Parties | న్యూఢిల్లీ, మార్చి 21: ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రతియేటా ఎన్నో రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. అయితే, వీటిల్లో ప్రభావాన్ని చూపేవి, ప్రజల మన్ననలు పొంది నిలబడేవి కొన్ని మాత్రమే. అందునా జాతీయ పార్టీలుగా గుర్తింపు దక్కించుకునే పార్టీల సంఖ్య వేళ్ల మీద లెక్కించొచ్చు. కొన్ని పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందినప్పటికీ కాలక్రమంలో ప్రభావం కోల్పోయి ప్రాంతీయ పార్టీలుగా మిగిలిపోయాయి. ఇంకొన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా ప్రస్థానం ప్రారంభించి జాతీయ పార్టీలుగా రూపాంతరం చెందాయి. 1951 ఎన్నికల్లో 14 జాతీయ పార్టీలు పోటీ చేయగా ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం ఆరు జాతీయ పార్టీలు మాత్రమే ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి.
1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 53 పార్టీలు పోటీ చేశాయి. వీటిల్లో 29 పార్టీలు.. జాతీయ పార్టీలుగా గుర్తించాలని కోరగా ఎన్నికల సంఘం మాత్రం 14 పార్టీలను జాతీయ పార్టీలుగా పరిగణించింది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం కేవలం కాంగ్రెస్, ప్రజా సోషలిస్టు పార్టీ(సోషలిస్టు పార్టీ, కిసాన్ మజ్దూర్ పార్టీల విలీనంతో ఏర్పడింది), సీపీఐ, జనసంఘ్ మాత్రమే జాతీయ పార్టీ గుర్తింపును కాపాడుకున్నాయి.