Cervical Cancer | గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (Cervical Cancer).. ఇప్పుడు దేశంలో అంతా ఈ వ్యాధి గురించే చర్చ జరుగుతోంది. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రస్థావన రావడమే ఇందకు ప్రధాన కారణం. 9 నుంచి 14 ఏళ్ల బాలికలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్పై దృష్టి సారించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
మహిళల్లో క్యాన్సర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది రొమ్ము క్యాన్సరే. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్). నిజానికి, గర్భాశయ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్. ఇక భారత్ (India)లో అత్యధికంగా వెలుగు చూస్తోన్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. లక్షల సంఖ్యలో సర్వైకల్ క్యాన్సర్ బాధితులు మన దేశంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 3,42,333 మంది ఈ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ భగేల్ (Satya Pal Singh Baghel) తెలిపారు. ఈ మేరకు లోక్సభ (Lok Sabha)కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎక్కువ మంది బాధితులున్న రాష్ట్రాల్లో ఉత్తర్ప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 11వ స్థానాల్లో ఉన్నాయి.
ఉత్తర్ప్రదేశ్లో 45,682 మంది సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడులో 36,014, పశ్చిమ బెంగాల్లో 25,822, బీహార్లో 23,164, కర్ణాటకలో 20,678 మంది, మధ్యప్రదేశ్లో 18,475 మంది బాధితులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఏపీలో 17,146 మంది, తెలంగాణలో 11,525 మంది బాధితులు ఉన్నట్లు వివరించింది.
Also Read..
Cervical Cancer | గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? నివారణ ఎలా..?
Ashok Gehlot | అశోక్ గెహ్లాట్కు కొవిడ్, స్వైన్ ఫ్లూ పాజిటివ్
Cancer | కబళిస్తున్న క్యాన్సర్.. దేశంలో ఒకే ఏడాది 9.1 లక్షల మందికిపైగా మృత్యువాత