భువనేశ్వర్ : ప్రిస్క్రిప్షన్లపై వైద్యుల చేతిరాత సామాన్యులకు ఓ పట్టాన అర్ధం కాదనే ఫిర్యాదులు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్స్, పోస్ట్మార్టం రిపోర్టులతో పాటు వైద్య-న్యాయపరమైన రిపోర్ట్స్ను స్పష్టమైన చేతిరాతతో పెద్ద అక్షరాల్లో రాసేలా చూడాలని ఒరిస్సా హైకోర్టు రాష్ట్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అన్ని వైద్య కేంద్రాలు, ప్రైవేట్ క్లినిక్లు, మెడికల్ కాలేజీలకు పంపాలని ఒడిషా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి ఆదేశించారు.
పాముకాటు కారణంగా తన కుమారుడు సౌభాగ్య రంజన్ భోయ్ మరణం నేపధ్యంలో డెంకనాల్ జిల్లాకు చెందిన రసానంద భోయ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మందుల పేర్లపై స్పష్టత ఉండేలా వైద్యుల చేతిరాతతో ప్రిస్క్రిప్షన్లు అందరికీ అర్ధమయ్యేలా ఉంండాలని ఈ ఆదేశాల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు.
మెడికో-లీగల్ డాక్యుమెంట్స్, పోస్ట్మార్టం నివేదికల్లో వైద్యుల చేతిరాత అస్పష్టంగా ఉండటంతో వీటిని చదివి ఓ అవగాహనకు రావడం కష్టమవుతోందని హైకోర్టు పేర్కొంది. జిగ్జాగ్ చేతిరాతను అనుసరించడం వైద్యుల్లో ఆనవాయితీగా ఉందని, వీటిని చదవడం సామాన్యులకు, న్యాయవ్యవస్ధకు సంక్లిష్టంగా మారిందని కోర్టు తెలిపింది.
Read More :
Drug Addict | ప్రపంచ కుబేరుడైనా డ్రగ్స్కు బానిసే.. అతనెవరంటే?