న్యూఢిల్లీ, మార్చి 21: ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తుండటంపై ఉమ్మడి న్యాయ పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. బీజేపీయేతర, కాంగ్రెసేతర విపక్ష కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ.. ఇందులో మొదటి అడుగుగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై కోర్టులో ఉమ్మడిగా పిటిషన్ వేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
‘సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జాయింట్ పిటిషన్ వేయడంపై మేం పనిచేస్తున్నాం. సుప్రీంకోర్టులోనో లేదా ఢిల్లీ హైకోర్టులోనో పిటిషన్ వేస్తాం. సంప్రదింపులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే మేం కోర్టును ఆశ్రయిస్తాం’ అని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపినట్టు ది హిందూ వార్తాసంస్థ మంగళవారం వెల్లడించింది.