న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో.. పార్లమెంట్ పదే పదే వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాలు జూలై 19న మొదలైన నాటి నుంచి లోక్సభ, రాజ్యసభల్లో ఇవే సీన్స్ కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా పలుమార్లు ఉభయసభలు వాయిదా పడ్డాయి. పెగాసస్ స్నూపింగ్ వ్యవహారంతో పాటు సాగు చట్టాల రద్దు అంశాలను చర్చించాలని విపక్ష సభ్యులు ఇస్తున్న వాయిదా తీర్మానాలను సభలు తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు మాక్ పార్లమెంట్ ( Mock Parliament ) నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్లో ఇప్పట్లో ప్రతిష్ఠంభన తొలిగే సూచనలు కనిపించడం లేదన్న ఆరోపణలు వినిస్తున్నాయి. దీంతో పార్లమెంట్ బయట మాక్ పార్లమెంట్ నిర్వహించేందుకు రేపు ఉదయం 14 ప్రతిపక్ష పార్టీలు భేటీకానున్నట్లు సమాచారం ఉంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష పార్టీలు భేటీ అవుతాయని తెలుస్తోంది. పెగాసస్ వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించినది అని, దాని గురించి పార్లమెంట్లో చర్చించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి.
సభా కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలను తప్పుపట్టారు. సాగు చట్టాలపై చర్చ చేపట్టాలన్న నినాదల నడుమ ఇవాళ రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. లోక్సభను కూడా 2 గంటల వరకు వాయిదా వేశారు.