శ్రీనగర్: కశ్మీరీ పండిట్ల భయం మళ్లీ నిజమైంది. తమకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం, ఎల్జీ పట్టించుకోకపోవటంతో మరో పండిట్ ప్రాణం పోయింది. ఏటీఎం గార్డుగా పనిచేస్తున్న ఓ పండిట్ (40)ను ఉగ్రవాదులు ఆదివారం కాల్చి చంపారు. పుల్వామా జిల్లాలోని అచన్కు చెందిన సంజయ్ శర్మ ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి స్థానిక మార్కెట్కు వెళ్తుండగా, కొందరు ఉగ్రవాదులు ఆయనను ఛాతిపై కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలించేలోపే ప్రాణం పోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంజయ్ శర్మ హత్యను కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి ఖండించింది. కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు కుక్కల్లా కాల్చి చంపుతున్నా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎల్జీ మనోజ్ షాలకు లెక్కలేదని తీవ్రంగా విమర్శించింది. 2020 నుంచి 9 మంది పండిట్లను ఉగ్రవాదులు కాల్చి చంపారని చెప్పారు. ఈ హత్యను కశ్మీర్ మాజీ సీఎం గులామ్ నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా తదితరులు ఖండించారు.