జైపూర్: ఒక ఇంటిలోని బంగారు ఆభరణాలను ఒక మహిళ దొంగిలించింది. సీసీటీవీ ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమాని మొబైల్ ఫోన్ ద్వారా ఇది చూశాడు. ఇంటికి తిరిగి వచ్చి ఆ మహిళను నిలువరించగా బట్టలు విప్పుకుంటానని ఆమె బెదిరించింది. (Woman Steals Jewellery) రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. జైపూర్లోని ముహానా ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తి ఇంట్లో కొన్ని రోజుల కిందట నగలు, డబ్బు చోరీ అయ్యాయి. దీంతో భద్రత, నిఘా కోసం తన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.
కాగా, గురువారం ఆ వ్యక్తి తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాడు. అతడు తన మొబైల్ ఫోన్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించాడు. ఆ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన ఒక మహిళ బెడ్రూమ్లోకి వెళ్లి బీరువా తెరిచింది. ఆభరణాల పెట్టె తీసి బెడ్పై ఉంచి వాటిని పరిశీలించింది. కొన్ని నగలు చోరీ చేసింది.
మరోవైపు ఆ వ్యక్తి ఇది చూసి షాక్ అయ్యాడు. వెంటనే తన పొరుగున నివసించే వ్యక్తికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. మెయిన్ గేట్కు తాళం వేయమని సూచించాడు. హుటాహుటిన ఇంటికి తిరిగి వచ్చాడు. గేట్ లాక్ వేయడంతో ఇంట్లో చిక్కుకున్న ఆ మహిళను ఇంటి యజమాని, పొరుగు వ్యక్తి కలిసి నిలదీశారు. ఈ సందర్భంగా తన బట్టలు చించుకుని విప్పుకుంటానని, వారిపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేస్తానని ఆమె బెదిరించింది.
అయితే ఆ వ్యక్తి దీనిని వీడియో రికార్డ్ చేశాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.