న్యూఢిల్లీ, జనవరి 3: దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 33,750 కేసులు, 123 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,49,22,822, మరణాలు 4,81,893కి చేరుకొన్నాయి. యాక్టివ్ కేసులు 1,45,582కి (0.42 శాతం) పెరిగాయి. 3,42,95,407మంది కోలుకొన్నారు. అటు ఒమిక్రాన్ బుసలు కొడుతున్నది. ఇప్పటివరకు 23 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాపించింది. కొత్తగా 175 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,700కు చేరింది. ఇప్పటివరకు 639 మంది కోలుకొన్నారు. ఢిల్లీలో ఒమిక్రాన్ వేవ్ ఉద్ధృతమవుతున్నది. డిసెంబర్ నెల చివరి రెండు రోజుల్లో నమోదైన మొత్తం కేసుల్లో 84 శాతం కేసులు ఒమిక్రాన్కు సంబంధించినవేనని అధికారులు తెలిపారు. నగరంలో తాజాగా 4,099 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 14,54,121కు చేరింది. కర్ణాటకలోనూ కొవిడ్ కలకలం సృష్టిస్తున్నది. రోజూవారీ కేసుల్లో ఏకంగా 241 శాతం పెరుగుదల నమోదయ్యింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,187 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 30,09,557కు చేరింది. బెంగాల్లోని మూడు దవాఖానలకు చెందిన 100 మందికి పైగా వైద్యులకు కరోనా సోకింది.
కరోనా సంక్షిప్త వార్తలు