జైపూర్ : కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాజస్ధాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎనిమిది నగరాల్లో సోమవారం రాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించనుంది. అన్ని రకాల మార్కెట్లను రాత్రి పదిగంటలకు మూసివేయాలని నిర్ణయించింది. అజ్మీర్, భిల్వారా, జైపూర్, జోధ్పూర్, కోట, ఉదయపూర్, సగ్వాద, కుశాల్గఢ్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలవనుంది. రాజస్ధాన్లోకి ప్రవేశించే ప్రజలు 72 గంటల ముందు నిర్ధారించిన కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ను తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ లేనివారిని 15 రోజుల పాటు క్వారంటైన్కు తరలిస్తారు. ఎయిర్పోర్టులు, బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని, మార్గదర్శకాలను పాటించని వారిపై సింగపూర్ వంటి దేశాల తరహాలో భారీ జరిమానాలు విధిస్తామని రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ హెచ్చరించారు. కొవిడ్-19 ప్రొటోకాల్ను ప్రజలు పట్టించుకోకపోవడంతో కేసులు పెరుగుతున్నాయని ఇక కరోనా నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాజస్ధాన్లో 476 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.