ప్రథమ పౌరుడి ఎన్నికకు మోగిన నగారా
ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లు
జూలై 18న పోలింగ్.. 21న ఫలితాలు
ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల
తెలంగాణ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉపేందర్రెడ్డి, ప్రసన్నకుమారి
న్యూఢిల్లీ, జూన్ 9: దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. 16వ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ జరుగనున్నది. జూలై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. అన్ని రాష్ర్టాలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఈసీ నియమించింది. తెలంగాణకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సీహెచ్ ఉపేందర్రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ వీఎన్ ప్రసన్నకుమారిని నియమించింది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్, కౌంటింగ్ సమయం లో కొవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్టు రాజీవ్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికకు జరిగే పోలింగ్లో ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వచ్చే నెల 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు.
సర్వత్రా ఆసక్తి
షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొన్నది. బరిలో ఎవరిని నిలుపాలన్న దానిపై అధికార, విపక్షాలు తలమునకలయ్యాయి. ఆదివాసిని లేదా మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. అభ్యర్థి ఎంపికపై మిత్రపక్షాలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.