ఢిల్లీ, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ చేస్తున్న కాలయాపనకు కారణాలు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది. గవర్నర్ ఆమోదం కోసం పంపిన పది బిల్లులను ఆమోదించకుండా తన వద్దే తొక్కి పెట్టడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కారు పిటిషన్ దాఖలు చేసిన కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్కు బదులుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం నిర్ణయించింది. అయితే నోటీసుల జారీ అవసరం లేదని కేంద్రం చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
ఈ కేసుపై విచారణ జరిపిన సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ జేబీ పార్ధీవాలాతో కూడిన ధర్మాసనం..గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడంపై కేంద్రం పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ గవర్నర్ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని కోరారు. చట్టసభలు తీర్మానం చేసిన బిల్లులకు మోక్షం కల్పించకుండా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నదని అన్నారు. కేంద్రంతోపాటు గవర్నర్ కార్యదర్శికి కూడా నోటీసు ఇవ్వాలని కోరారు. దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. తుషార్ వాదనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.