Jairam Ramesh on Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా స్పందించారు. ఇది వేధింపుల్లో భాగమేనని గురువారం ట్వీట్ చేశారు. గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ అధికారుల ముందు మల్లిఖార్జున ఖర్గే విచారణకు హాజరయ్యారు. రాత్రి 8.30 గంటలకు నేషనల్ హెరాల్డ్ కార్యాలయాన్ని ఖర్గే వీడారు.
`పార్లమెంట్ సమావేశం మధ్యలో మల్లిఖార్జున ఖర్గేను దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించారు. ఆయన ఇప్పటికీ ఈడీతోనే ఉన్నారు. ఇది విచారకరం. ఉపరాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాకు రాత్రి 7.30 గంటలకు ఖర్గే విందు ఇవ్వాల్సి ఉంది` అని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. యంగ్ ఇండియా ఆఫీసులో తనిఖీల సమయంలో మల్లిఖార్జున ఖర్గే హాజరు కావాలని ఈడీ కోరింది. యంగ్ ఇండియా సంస్థ ముఖ్య అధికారిగా ఖర్గే ఉన్నారు.