న్యూఢిల్లీ : రైతులకు భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావొచ్చని పేర్కొంది.
ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని చెప్పింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా వాయవ్య, దక్షిణ భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని పేర్కొంది. గత మూడేళ్లలో కూడా భారత్లో నైరుతి రుతు పవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదైంది.
జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య గల కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తుంటారు. ఇదిలా ఉండగా.. జూన్ 26-27 వరకు ఢిల్లీని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ సమాచార ఏజెన్సీ స్కైమెట్ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 26 నుంచి 27 వరకు సాధారణ రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. జూలై వరకు విస్తరిస్తాయని పేర్కొంది.