తిరువనంతపురం : కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. కన్నూరు జిల్లాలోని తలసేరి నియోజకవర్గం, త్రిశూర్లోని గురువాయూర్, ఇడుక్కి జిల్లాలోని దేవికుళంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులు తిరస్కరించారు. తలసేరి జిల్లాలో బీజేపీ ఆ పార్టీ కన్నూర్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఎన్ హరిదాస్ను బరిలో నిలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 22,125 ఓట్లు సాధించింది. హరిదాస్ దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి సంతకం లేదంటూ నామినేషన్ను తిరస్కరించారు. గురువాయూర్లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నివేదా, కేరళలో కూటమి అభ్యర్థి అయిన ధనలక్ష్మి నామినేషన్లు.. అలాగే దేవికుళంలో ఏఐఏడీఎంకే అభ్యర్థి నామినేషన్ సైతం తిరస్కరించగా.. కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే, బీజేపీకి చెందిన సీనియర్ నామినేషన్ను తిరస్కరించడం ఆ పార్టీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందంలో భాగమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఏ విజయరాఘవన్ ఆరోపించారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం), బీజేపీ మధ్య అవగాహన నేపథ్యంలో నామినేషన్ తిరస్కరించినట్లు కేపీసీసీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ఆరోపించారు.