నోయిడా : కరోనాతో బాధపడుతున్న తన కొడుకును బతికించుకునేందుకు, రెమ్డెసివిర్ కోసం చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) కాళ్లు మొక్కింది. కానీ ఆ ఇంజక్షన్ పొందలేకపోయింది. చివరకు కొడుకును కోల్పోయింది ఆ తల్లి.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన రింకీ దేవి కుమారుడికి ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, చికిత్స నిమిత్తం సెక్టార్ 51లోని ఆస్పత్రిలో చేర్పించింది. అయితే రెమ్డెసివిర్ ఇంజక్షన్ తీసుకురావాలని ఆస్పత్రి సిబ్బంది రింకీ దేవికి చెప్పారు. ఆ ఇంజక్షన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దీపక్ ఓహ్రీ కార్యాలయం వద్ద అందుబాటులో ఉందని ఆమెకు తెలిసింది.
దీంతో ఆమె అక్కడికి చేరుకుని, తన కుమారుడి ప్రాణాలను కాపాడుకునేందుకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కావాలని ప్రాధేయపడింది. చివరకు సీఎంవో కాళ్లు మొక్కి వేడుకుంది. అక్కడ కూడా రెమ్డెసివిర్ అందుబాటులో లేదని సీఎంవో ఆమెకు వివరించారు. చేసేదేమీ లేక నిన్న సాయంత్రం 4:30 గంటలకు కుమారుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లింది. అప్పటికే ఆ బాబు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రింకీ దేవి తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇవికూడా చదవండి..