న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యాజమాన్యం అడ్డంకులు సృష్టించిందని జేఎన్యూఎస్యూ విద్యార్థి నేతలు ఆరోపించారు. తమ కార్యాలయంలో విద్యుత్తు, ఇంటర్నెట్ సరఫరా నిలిపివేసిందని పేర్కొన్నారు. జేఎన్యూ యాజమాన్యం అడ్డంకులు సృష్టించినప్పటికీ, విద్యార్థులు ఆన్లైన్ యాప్ ద్వారా డాక్యుమెంటరీని తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఇతరులకు షేర్ చేసుకొని వీక్షించారని ఏఐఎస్ఏ నేత ఎన్ సాయిబాలాజీ పేర్కొన్నారు. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ లింక్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే.